KCR: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను పరామర్శించారు. గుండెపోటు రావడంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను నేరుగా అడిగి తెలుసుకున్న కేసీఆర్, అవసరమైన అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.
కేసీఆర్ వెంట మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, పద్మారావు గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు. వారి రాకతో ఆస్పత్రి వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కేసీఆర్ ఆస్పత్రికి వస్తున్నారనే సమాచారం ముందుగానే వ్యాపించడంతో అభిమానులు ఆయనను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఒక్కసారిగా ముందుకు రావడంతో అక్కడ స్వల్ప రద్దీ నెలకొంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పరామర్శ కార్యక్రమం ముగిసిన అనంతరం కేసీఆర్ అక్కడి నుంచి ఎర్రవల్లి ఫామ్హౌస్కు బయలుదేరారు.








