CM Chandrababu: గుడివాడలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు ముఖ్యమైన హామీలు, ప్రకటనలు చేశారు. ఎన్టీఆర్ జన్మస్థలంలో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్న ఆయన, సంక్షేమం-అభివృద్ధి కలిసే ముందుకు సాగాలన్నదే టీడీపీ సిద్ధాంతమని చెప్పారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామని, 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేస్తామని ప్రకటించారు. వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానమే తమ లక్ష్యమని, కరువు లేని ఆంధ్రప్రదేశ్ను నిర్మిస్తామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం వెనుకడుగు వేయదని స్పష్టం చేసిన సీఎం, ఈ నెల 22 నుంచి 24 మధ్య ‘తల్లికి వందనం’ పథకం కింద రూ.10,122 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు.
అంగన్వాడీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఆక్వా రైతులకు తక్కువ ధరకు విద్యుత్ అందిస్తూ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రాజకీయాలపై మాట్లాడిన చంద్రబాబు.. గత ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వానికే మద్దతు ఇచ్చారని అన్నారు. గుడివాడ అభివృద్ధికి రూ.162 కోట్లతో పనులు చేపడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నేరాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన ఆయన, తప్పు చేసిన వ్యక్తి ఎవరైనా చట్టం ముందు ఒకటేనని హెచ్చరించారు. సొంత పార్టీ నాయకుడైనా తప్పు చేస్తే చర్యలు తప్పవని మరోసారి స్పష్టం చేశారు.








