Peru Bus Accident: దక్షిణ అమెరికా దేశమైన పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అయాకుచో ప్రాంతంలోని ఆండీస్ పర్వత మార్గంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రమాద తీవ్రతకు బస్సు పూర్తిగా ధ్వంసమై శకలాలు లోయలో చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన ప్రయాణికులను రెస్క్యూ చేసి సమీప ఆస్పత్రులకు తరలించారు. వారిలో పదిమందికిపైగా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుండగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో బస్సు నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఆండీస్ పర్వత ప్రాంతంలోని ఇరుకైన మలుపులు, దెబ్బతిన్న రహదారులు, అతివేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం వంటి అంశాలు ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి దారితీసిన అసలు కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.








