India Australia Agreement: భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు మరో కీలక దశలోకి ప్రవేశించాయి. ఇంధన భద్రతతో పాటు అణుశక్తి, కీలక ఖనిజాలు, వ్యూహాత్మక రంగాల్లో కలిసి పనిచేసే దిశగా ఇరు దేశాలు కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టాయి. ఈ ఒప్పందాల్లో భాగంగా భారత పౌర అణుశక్తి అవసరాల కోసం ఆస్ట్రేలియా నుంచి దీర్ఘకాలికంగా యురేనియం సరఫరా చేయడానికి అంగీకారం కుదిరింది.
ఈ పరిణామాన్ని స్వాగతించిన ప్రధాని నరేంద్ర మోడీ, దేశంలో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిని వేగవంతం చేయడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు, కార్బన్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యాలకు కూడా ఇది దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో భద్రతా సహకారం, కీలక ఖనిజాల సరఫరా, పరిశ్రమల అభివృద్ధి వంటి అంశాలపైనా విస్తృతంగా చర్చించారు. భవిష్యత్తు సాంకేతిక రంగాలకు అవసరమైన క్రిటికల్ మినరల్స్ సరఫరాను బలోపేతం చేసేందుకు ప్రత్యేక “క్రిటికల్ మినరల్స్ కారిడార్” ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2047 నాటికి భారత్లో 100 గిగావాట్ల అణుశక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలని ఇరు దేశాలు సంకల్పించాయి.
ఈ దిశగా ఆస్ట్రేలియాలోని యురేనియం నిల్వలు భారత్కు దీర్ఘకాలిక ఇంధన భద్రతను అందించనున్నాయి. సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో, అణు సరఫరాదారుల సమూహం (NSG)లో భారత్ సభ్యత్వానికి ఆస్ట్రేలియా మరోసారి మద్దతు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన తాజా ఒప్పందాలు భవిష్యత్తులో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నాయని ఇరు నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.








