Godrej Agrovet: తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో గోద్రేజ్ ఆగ్రోవెట్ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిసి రాష్ట్రంలో చేపట్టనున్న సమీకృత ఆయిల్ పామ్ ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో ఏర్పాటు కానున్న తొలి సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ పురోగతిపై కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో జరిగిన సమావేశంలో గోద్రేజ్ గ్రూప్ కార్పొరేట్ అఫైర్స్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి, గోద్రేజ్ ఆగ్రోవెట్ ఆయిల్ పామ్ విభాగం సీఈఓ సౌగత నియోగి పాల్గొన్నారు. ప్రాజెక్టు అమలు ప్రణాళిక, భవిష్యత్ విస్తరణ అవకాశాలు, రైతులకు కలిగే ప్రయోజనాలపై సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు.
రూ.300 కోట్ల పెట్టుబడితో ఖమ్మం జిల్లాలో చేపట్టనున్న ఈ సమీకృత ప్రాజెక్టు వల్ల 700 మందికిపైగా స్థానికులకు ఉపాధి లభించే అవకాశముందని సంస్థ వెల్లడించింది. ఇందులో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్, ఆధునిక నర్సరీ, పరిశోధన-అభివృద్ధి కేంద్రం, సీడ్ గార్డెన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కొనిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో ప్రభుత్వం ఇప్పటికే 113.5 ఎకరాల భూమిని కేటాయించింది.
అలాగే సీడ్ గార్డెన్ విస్తరణ కోసం అదనంగా 35 నుంచి 40 ఎకరాల భూమిని కేటాయించాలని కంపెనీ కోరింది. ప్రాసెసింగ్ యూనిట్కు అనుసంధానంగా రహదారి విస్తరణ అవసరాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, టీజీఐఐసీ ఆధ్వర్యంలో రహదారి విస్తరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు, గ్రామీణ ఉపాధి అవకాశాల పెంపుకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.








