LPG cylinders: మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు పలు జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నదులు, వాగులు పొంగిపొర్లడంతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో రాయగడ్ జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటన అధికారులను అప్రమత్తం చేసింది. పాతాళగంగ ప్రాంతంలో ఉన్న హెచ్పీసీఎల్ ఎల్పీజీ బాట్లింగ్ యూనిట్లోకి వరద నీరు భారీగా ప్రవేశించింది.
నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ప్లాంట్లో నిల్వ ఉంచిన సుమారు 3 వేల ఎల్పీజీ సిలిండర్లు వరదలో కొట్టుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. వరద నీటిలో వందల సంఖ్యలో సిలిండర్లు తేలుతూ వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వరద ప్రవాహంతో కొట్టుకొచ్చిన కొన్ని సిలిండర్లు నది ఒడ్డుకు చేరుతుండగా, వాటిని కొందరు స్థానికులు ఇళ్లకు తీసుకెళ్తున్నట్లు సమాచారం.
ఈ పరిణామంపై అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరదలో కొట్టుకుపోయిన సిలిండర్లు దెబ్బతిని గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉండటంతో వాటిని తాకడం లేదా తరలించడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఎక్కడైనా గ్యాస్ సిలిండర్లు కనిపిస్తే వాటి దగ్గరకు వెళ్లకుండా వెంటనే స్థానిక రెవెన్యూ, పోలీసు లేదా విపత్తు నిర్వహణ అధికారులకు సమాచారం ఇవ్వాలని రాయగడ్ జిల్లా యంత్రాంగం సూచించింది. మరోవైపు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి వరద ప్రభావిత ప్రాంతాల్లో సిలిండర్లను గుర్తించి సురక్షితంగా స్వాధీనం చేసుకునే చర్యలు చేపట్టాయి. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.








