భారతీయ నాటక, సినీ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటి, దర్శకురాలు విజయ్ మెహతా(Vijay Mehta) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మంగళవారం రాత్రి ముంబైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
ఆమె మరణవార్త తెలిసిన వెంటనే సినీ, నాటక రంగాలతో పాటు సాహిత్య, సాంస్కృతిక వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మరాఠీ రంగస్థల చరిత్రలో ప్రయోగాత్మక నాటకాలకు కొత్త దిశను చూపించిన కళాకారిణిగా విజయ్ మెహతా ప్రత్యేక గుర్తింపు పొందారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు రంగస్థలంపై ఆమె చేసిన కృషి అనేకమందికి స్ఫూర్తిగా నిలిచింది.
ప్రముఖ రచయిత విజయ్ టెండూల్కర్తో కలిసి ‘రంగాయన్’ అనే నాటక సంస్థను స్థాపించి వినూత్న ప్రదర్శనలకు శ్రీకారం చుట్టారు. సాంప్రదాయ నాటకాలకు భిన్నంగా కొత్త ఆలోచనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటిగానే కాకుండా దర్శకురాలిగానూ విజయ్ మెహతా విశేష గుర్తింపు పొందారు. ఆమె తెరకెక్కించిన ‘రావ్ సాహెబ్’, ‘పెస్టోంజీ’ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.
గోవింద్ నిహలానీ రూపొందించిన ‘పార్టీ’ చిత్రంలో ఆమె నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. భారతీయ రంగస్థల, సినీ కళలకు చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో పాటు సంగీత నాటక అకాడమీ అవార్డుతో సత్కరించింది. విజయ్ మెహతా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ ప్రదర్శన కళారంగ అభివృద్ధిలో ఆమె పాత్ర చిరస్మరణీయమని పేర్కొంటూ, ఆమె సృజనాత్మక వారసత్వం భవిష్యత్ తరాల కళాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు.
పలువురు సినీ, నాటక ప్రముఖులు కూడా ఆమెకు ఘనంగా నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Vijay Mehta | భారతీయ నాటక రంగానికి తీరని లోటు.. విజయ్ మెహతా ఇకలేరు, సంతాపం తెలిపిన ప్రధాని మోడీ
-








