Heavy rains: ఆంధ్రప్రదేశ్లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముండటంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాయలసీమ జిల్లాల్లో కూడా వాతావరణం మారనున్నట్లు అంచనా వేస్తున్నారు.
అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, రైతులు మరియు సాధారణ ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కోస్తాంధ్ర నుంచి తెలంగాణ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుండగా, ఈశాన్య మరియు తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో వాతావరణ ఆవర్తనం కొనసాగుతోంది.
ఈ రెండు వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రజలు ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.








