Nuclear Arsenal: భారత్ తన వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. ప్రపంచ భద్రతా పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో అణ్వాయుధ వ్యవస్థలను ఆధునికీకరించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తాజా అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది.
స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) విడుదల చేసిన వార్షిక అంచనా ప్రకారం, 2025 జనవరి నాటికి భారత్ వద్ద సుమారు 190 అణు వార్హెడ్లు ఉన్నాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 10 వార్హెడ్ల పెరుగుదలగా పేర్కొంది. అలాగే పాకిస్థాన్ కంటే భారత్ వద్ద సుమారు 20 అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. చైనా, పాకిస్థాన్లలోని దూర ప్రాంత లక్ష్యాలను చేరుకునే సామర్థ్యంతో కూడిన వ్యవస్థల అభివృద్ధిపై భారత్ దృష్టి పెట్టినట్లు సిప్రి పేర్కొంది. భవిష్యత్ భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘశ్రేణి అణు సామర్థ్యాల పెంపుపై చర్యలు కొనసాగుతున్నాయని నివేదికలో వివరించింది.
ప్రపంచ అణ్వాయుధ దేశాల జాబితాలో రష్యా 5,420 వార్హెడ్లతో అగ్రస్థానంలో నిలవగా, అమెరికా 5,042 అణ్వాయుధాలతో రెండో స్థానంలో ఉంది. చైనా వద్ద 620 అణు వార్హెడ్లు ఉన్నట్లు సిప్రి అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం తొమ్మిది దేశాలు కలిపి 12 వేలకుపైగా అణ్వాయుధాలను కలిగి ఉన్నాయని నివేదిక వెల్లడించింది.
అణ్వాయుధ సామర్థ్యంతో పాటు రక్షణ వ్యయంలోనూ భారత్ గణనీయ పురోగతి సాధిస్తోంది. 2025లో భారత రక్షణ వ్యయం 92.1 బిలియన్ డాలర్లకు చేరిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 8.9 శాతం అధికమని నివేదిక తెలిపింది. ప్రపంచంలో అత్యధిక రక్షణ వ్యయం చేసే దేశాల్లో భారత్ ఐదో స్థానంలో నిలవడం గమనార్హం.
Nuclear Arsenal | రక్షణ రంగంలో దూసుకెళ్తున్న భారత్.. పాకిస్థాన్ కంటే 20 వార్హెడ్లు అధికం
-








