India T20 Captain: భారత క్రికెట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా టీ20 జట్టుకు కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను నియమిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు జట్టును నడిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అయ్యర్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడంతో జట్టు భవిష్యత్ వ్యూహంలో పెద్ద మార్పు చోటుచేసుకుంది. సెలక్షన్ కమిటీ సమావేశం అనంతరం బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా కొత్త జట్టును ప్రకటించింది.
ఈ ప్రకటనలో శ్రేయస్ అయ్యర్ను టీ20 కెప్టెన్గా నియమించినట్లు స్పష్టం చేసింది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ క్రికెటర్ తిలక్ వర్మకు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించడం మరో ముఖ్య నిర్ణయంగా నిలిచింది. యువ ప్రతిభను ప్రోత్సహించే దిశగా సెలక్షన్ కమిటీ అడుగులు వేసింది. ఈ క్రమంలో ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లకు కూడా జట్టులో అవకాశం కల్పించింది.
అనుభవం మరియు యువశక్తి కలయికతో భవిష్యత్ టీమిండియాను మరింత బలంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. జట్టులో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా, రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి తదితరులకు చోటు లభించింది. ఈ కొత్త నాయకత్వంతో టీమిండియా టీ20 జట్టు కొత్త దశలోకి ప్రవేశించనుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.








