Janasena Party: ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్కు జనసేన రాజ్యసభ టికెట్ దక్కింది. ఈ నిర్ణయాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ అధికారికంగా నిర్ణయం తీసుకోగా, శనివారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
లింగమనేని రమేష్కు జనసేన పార్టీతో దశాబ్దానికి పైగా అనుబంధం ఉంది. 2015 నుంచి పవన్ కల్యాణ్ ఆలోచనలు, ముఖ్యంగా సామాజిక సమతుల్యత, అభివృద్ధి లక్ష్యాలతో కూడిన రాజకీయ దృక్పథానికి ఆకర్షితుడై పార్టీ కార్యక్రమాలకు మద్దతు ఇస్తూ వస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు వివిధ సామాజిక వర్గాల మధ్య సమన్వయం అవసరమనే భావనను ఆయన ఎప్పటి నుంచో సమర్థిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ నేపథ్యంలో పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధతను గుర్తిస్తూ రాజ్యసభకు అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు సమాచారం. అభ్యర్థిత్వం ఖరారైన అనంతరం లింగమనేని రమేష్ స్పందిస్తూ పవన్ కల్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పారు.
అలాగే కూటమి తరఫున మద్దతు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది కేవలం ఒక పదవి కాదని, ప్రజల పట్ల మరింత బాధ్యతతో పనిచేసే అవకాశం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం రాజ్యసభ వేదికగా తన వంతు కృషి కొనసాగిస్తానని లింగమనేని రమేష్ వెల్లడించారు.








