Vladimir Putin: SPIEF వేదికపై ప్రసంగించిన రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత్ స్వతంత్ర నిర్ణయాలు మరియు ద్వైపాక్షిక సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత్ను ఆర్థిక ఆంక్షలు లేదా రాజకీయ ఒత్తిళ్ల ద్వారా ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తే, అలాంటి చర్యలు తిరిగి ఆ దేశాలకే నష్టాన్ని కలిగిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్ ఒక సార్వభౌమ దేశంగా తన జాతీయ ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుందని, విదేశాంగం మరియు రక్షణ రంగాల్లో ఎవరితో భాగస్వామ్యం కావాలనేది స్వయంగా నిర్ణయించుకునే హక్కు కలిగి ఉందని పుతిన్ పేర్కొన్నారు. బాహ్య ఒత్తిళ్లకు భారత్ లొంగదని, మోడీ నాయకత్వంలో దేశం స్వతంత్ర విధానాన్ని కొనసాగిస్తోందని అన్నారు.
రక్షణ సహకారం విషయానికి వస్తే, భారత్తో కలిసి అత్యాధునిక Su-57 యుద్ధ విమాన ప్రాజెక్టుపై గతంలో చర్చలు జరిగినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ ఐదో తరం యుద్ధ విమానాన్ని భారత్కు అందించడానికి లేదా సంయుక్త భాగస్వామ్య అవకాశాలను పరిశీలించడానికి రష్యా సిద్ధంగా ఉందని వెల్లడించారు. భారత్-రష్యా సంబంధాలు కేవలం ఆయుధాల కొనుగోలు, అమ్మకాలకే పరిమితం కాకుండా పరిశోధన, సాంకేతిక అభివృద్ధి రంగాల్లోనూ విస్తరించాయని పుతిన్ చెప్పారు.
బ్రహ్మోస్ క్షిపణి ప్రాజెక్టును ఈ భాగస్వామ్యానికి ఉత్తమ ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ఇరుదేశాల నిపుణుల సహకారంతో అది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోడీ రాజకీయ ప్రయాణాన్ని ప్రస్తావించిన పుతిన్, గతంలో ఎదురైన సవాళ్లను అధిగమించి అంతర్జాతీయ వేదికపై భారత్ తన ప్రభావాన్ని మరింత పెంచుకుందని వ్యాఖ్యానించారు.








