Telangana Formation Day: ఎన్నో త్యాగాలు, ఉద్యమాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని నేడు అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ అవతరణ దినోత్సవం ప్రతి పౌరుడిలో ఆత్మగౌరవం, బాధ్యతను పెంపొందించే సందర్భంగా నిలవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి మంత్రి వివరించారు.
ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను మంత్రి ఘనంగా సన్మానించారు.
రాష్ట్ర సాధన కోసం వారు చేసిన త్యాగాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారులు, విద్యార్థుల ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు పరిచయం చేసేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేశారు.
మంత్రి పొంగులేటి వాటిని సందర్శించి కార్యక్రమాల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి, సాంస్కృతిక కార్యక్రమాల్లో విశేష ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.








