ఉత్తరాంధ్ర ప్రజలు కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ (South Coast Railway Zone) ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన ఈ నూతన రైల్వే జోన్ జూన్ 1 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది.
దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను కేంద్ర రైల్వే శాఖ ఇప్పటికే విడుదల చేసింది. ప్రత్యేక రైల్వే జోన్ కోసం ఉత్తరాంధ్ర ప్రజలు నాలుగు దశాబ్దాలకుపైగా ఉద్యమాలు నిర్వహించారు. రాష్ట్ర విభజన చట్టంలో కూడా ఈ జోన్ ఏర్పాటుకు హామీ లభించినప్పటికీ, పరిపాలనా కారణాలతో ప్రక్రియ ఆలస్యమైంది.
2019లో విశాఖ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముడసర్లోవ ప్రాంతంలో ప్రధాన కార్యాలయానికి అవసరమైన భూమిని కేటాయించడంతో ఏర్పాట్లు వేగవంతమయ్యాయి.
శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు విశాఖలోని వీఎంఆర్డీఏ ‘ది డెక్’ భవనంలో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే జనరల్ మేనేజర్తో పాటు కీలక అధికారులు విధుల్లో చేరారు. కొత్త దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు పునర్వ్యవస్థీకరించిన విశాఖపట్నం డివిజన్ను చేర్చారు.
ఈ కలయికతో దేశంలోని అత్యంత కీలక రైల్వే జోన్లలో ఒకటిగా ఇది అవతరించింది. వాల్తేరు డివిజన్ను విభజించి రాయగడ డివిజన్ను తూర్పు కోస్తా రైల్వేలో కొనసాగించగా, విశాఖపట్నం డివిజన్ను కొత్త జోన్లో విలీనం చేశారు.
ఇచ్ఛాపురం–పలాస–విశాఖపట్నం–దువ్వాడ, విజయనగరం–కూనేరు వంటి కీలక రైల్వే మార్గాలు ఈ డివిజన్ పరిధిలోకి వచ్చాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మక మైలురాయి అని పేర్కొన్నారు.
కొత్త రైల్వే జోన్ ద్వారా రాష్ట్రంలో రవాణా, లాజిస్టిక్స్, పారిశ్రామిక రంగాలకు భారీ ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.








