TDP Mahanadu: టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పొలిట్బ్యూరో సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాబోయే మహానాడు నిర్వహణ ప్రధాన అజెండాగా చర్చ జరిగింది. పార్టీ కీలక నేతలతో కలిసి వివిధ అంశాలపై సీఎం మార్గనిర్దేశం చేశారు.
మహానాడు కార్యక్రమం “కార్యకర్తే అధినేత” అనే సిద్ధాంతాన్ని ప్రతిబింబించేటట్లు ఉండాలని CM స్పష్టం చేశారు. అలాగే పార్టీ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యం సమాజానికి స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవడం పార్టీకి అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.
బీసీల అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టమైన సందేశం వెళ్లాలని సీఎం పేర్కొన్నారు. జనాభాలో సగం భాగమైన బీసీలు పార్టీ ఆవిర్భావం నుంచే వెన్నుదన్నుగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. వారి సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన విధానాలు మహానాడులో స్పష్టంగా చర్చకు రావాలని సూచించారు.
హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్న మహానాడు విజయవంతం చేయాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉదయం 9 గంటల నుంచే కార్యక్రమాలు ప్రారంభించాలని, ప్రతి వక్త తనకు కేటాయించిన అంశాన్ని సంక్షిప్తంగా, స్పష్టంగా చెప్పాలని సూచించారు.
ఈ మహానాడులో ప్రవేశపెట్టనున్న 19 తీర్మానాలకు పొలిట్బ్యూరో ఆమోదం తెలిపినట్లు సమాచారం. పార్టీ భవిష్యత్ దిశను నిర్దేశించే కీలక సమావేశంగా ఇది నిలిచింది.








