Saraswati Anthya Pushkaralu: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో భక్తిశ్రద్ధల మధ్య ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గోదావరి నదిలో పుష్కర స్నానం ఆచరించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి, సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో 12 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా 12 మంది పీఠాధిపతులు పుష్కర స్నానాలు ఆచరిస్తారని చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రజల సుఖశాంతుల కోసం ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ప్రతిరోజూ సాయంత్రం గోదావరి నదికి ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. కాశీ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా హారతి కార్యక్రమాలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఈ పుష్కర మహోత్సవాలకు రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశముందని చెప్పారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వెల్లడించారు. గత ఆదిపుష్కరాల సమయంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు. రవాణా సౌకర్యాల కోసం ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సులను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పుష్కర కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు.








