DMK MLA: తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి దళపతి విజయ్ ప్రభుత్వంపై డీఎంకే నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో డీఎంకే సీనియర్ నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
దక్షిణ తమిళనాడులో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన అనితా రాధాకృష్ణన్.. విజయ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువకాలం నిలవదని వ్యాఖ్యానించారు. “ఈ ప్రభుత్వం మరో నాలుగు నుంచి ఆరు నెలలకంటే ఎక్కువ నిలబడదు. ఆ తర్వాత మా తలైవర్ ఎం.కె. స్టాలిన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల్లో డీఎంకే అధినేత స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కొలత్తూర్లో టీవీకే అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూడటంపై కూడా ఆయన స్పందించారు. “స్టాలిన్ కొలత్తూర్ను సింగపూర్లా అభివృద్ధి చేశారు. కానీ అక్కడి ప్రజలు దాని విలువను గుర్తించలేదు. రాబోయే ఎన్నికల్లో స్టాలిన్ తిరుచ్చి నుంచి పోటీ చేయాలని మేము కోరుకుంటున్నాం” అని అన్నారు.
ఇదే సమావేశంలో మంత్రి ఆధవ్ అర్జున్కు ఆయన బహిరంగ సవాల్ విసిరారు. ఆధవ్ అర్జున్కు నిజంగా ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన సవాల్ విసిరారు. నేను కూడా రాజీనామా చేస్తాను. ఇద్దరం తిరుచెందూర్లో పోటీ చేసి ప్రజల తీర్పు తెలుసుకుందాం” అంటూ సవాల్ చేశారు. తిరుచెందూర్ నియోజకవర్గం గత 25 ఏళ్లుగా అనితా రాధాకృష్ణన్కు బలమైన కోటగా కొనసాగుతోంది.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ ఒంటరిగానే 108 స్థానాలు గెలుచుకుంది. అనంతరం కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పడింది. విశ్వాస పరీక్షలో కూడా విజయ్ ప్రభుత్వం 144 ఓట్లతో విజయం సాధించింది.
అయితే అధికారం కోల్పోయిన డీఎంకే.. విజయ్ ప్రభుత్వం అస్థిరంగా ఉందంటూ ప్రచారం చేస్తోంది. మరోవైపు టీవీకే నేతలు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. డీఎంకే నేతల తాజా వ్యాఖ్యలపై సీఎం విజయ్ కార్యాలయం లేదా ఆధవ్ అర్జున్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
ALSO READ:IPL 2026 | వరుస ఓటములతో కుంగిపోయిన పంజాబ్.. వైరల్గా మారిన పాంటింగ్ ఫోటో








