దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో అండర్గ్రాడ్యుయేట్ ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ NEET UG 2026 పరీక్షకు సంబంధించి జాతీయ పరీక్షల సంస్థ (NTA) కొత్త తేదీని ప్రకటించింది. తాజా ప్రకటన ప్రకారం, పరీక్షను జూన్ 21న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన పరీక్ష ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దు చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే.
పరీక్ష వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం దెబ్బతినకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ తెలిపింది. పరీక్ష నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయతను కాపాడడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది.
ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో ప్రశ్నల లీక్ ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. 410 ప్రశ్నలతో కూడిన ఒక అంచనా ప్రశ్నపత్రం కొందరు అభ్యర్థుల మధ్య చక్కర్లు కొట్టినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.
అందులోని 120 రసాయన శాస్త్ర ప్రశ్నలు, 100కు పైగా జీవశాస్త్ర ప్రశ్నలు అసలు ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో సరిపోలినట్లు ప్రచారం జరిగింది. దీంతో పరీక్షపై అనుమానాలు మరింత పెరిగాయని అధికారులు పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో పరీక్షను కొనసాగించడం కంటే రద్దు చేసి మళ్లీ నిర్వహించడమే సముచితమని నిర్ణయించినట్లు ఎన్టీఏ తెలిపింది. ఈ నెల 3న భారత్తో పాటు విదేశాల్లో కూడా నిర్వహించిన నీట్ (UG)-2026 పరీక్షకు మొత్తం 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పుడు కొత్త తేదీతో పరీక్ష మళ్లీ నిర్వహించబడనుంది.








