దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం కీలక చర్యలు చేపట్టింది. ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) మూడో దశను అమలు చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం 16 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక ప్రక్షాళన ద్వారా దాదాపు 36.73 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలించాలని ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఓటర్ల జాబితాలోని తప్పులను సరిచేయడం, డూప్లికేట్ పేర్లను తొలగించడం, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని ఈసీ వెల్లడించింది.
సంబంధిత రాష్ట్రాల ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా 18 ఏళ్లు పూర్తిచేసుకున్న కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
రాబోయే ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా అత్యంత ఖచ్చితమైన ఓటర్ల డేటాను సిద్ధం చేయడమే లక్ష్యమని ఎన్నికల సంఘం పేర్కొంది. గత రెండు దశలు విజయవంతంగా పూర్తికావడంతో ఇప్పుడు మూడో దశను భారీ స్థాయిలో అమలు చేస్తున్నారు.








