Sugar Ban: దేశంలో చక్కెర ధరలు పెరిగే అవకాశాల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ మార్కెట్లో సరఫరాను స్థిరంగా ఉంచేందుకు చక్కెర ఎగుమతులను తక్షణమే నిషేధిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధం 2026 సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమల్లో ఉండనుంది. ముడి చక్కెర, తెల్ల చక్కెర, శుద్ధి చేసిన చక్కెరపై ఈ ఆంక్షలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
దేశీయంగా చక్కెర ధరలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎగుమతులను నిలిపివేయడం ద్వారా దేశీయ మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు అదుపులో ఉంటాయని కేంద్రం భావిస్తోంది.
అయితే కొన్ని ప్రత్యేక కేటగిరీలకు మినహాయింపులు ఇచ్చింది. సీఎక్స్ఎల్, టీఆర్క్యూ కోటాలు, అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్, అలాగే ప్రభుత్వాల మధ్య ఒప్పందాల కింద జరిగే ఎగుమతులు ఈ నిషేధానికి వర్తించవని వెల్లడించింది. అమెరికాకు వెళ్లే కొన్ని ప్రత్యేక ఎగుమతులకు కూడా మినహాయింపు కల్పించింది.
ఇప్పటికే ఎగుమతి ప్రక్రియలో ఉన్న సరుకు రవాణాలకు కూడా ఈ నిషేధం నుంచి ఉపశమనం ఇచ్చారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఎగుమతి విధానాన్ని “నియంత్రితం” నుంచి “నిషేధితం”గా మార్చుతూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రపంచంలో బ్రెజిల్ తర్వాత అతిపెద్ద చక్కెర ఎగుమతిదారుగా ఉన్న భారత్లో చెరుకు దిగుబడులు వరుసగా రెండో ఏడాది తగ్గే అవకాశం ఉందని అంచనా. దేశీయ వినియోగానికి సరిపడా నిల్వలు ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం ప్రపంచ మార్కెట్లో చక్కెర ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.








