Telangana: తెలంగాణ ప్రభుత్వం రైతులకు నేరుగా ఉపయోగపడేలా “సాయిల్ హెల్త్ వాలంటీర్లు”(Soil Health Volunteers) అనే కొత్త వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించిన ఈ ప్రణాళిక ప్రకారం, ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురు చొప్పున వాలంటీర్లను నియమించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 వేల మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో భాగమవుతారు. రైతులకు భూసారం పరిరక్షణ, నేల నాణ్యత మెరుగుదల, పంటలకు అనుగుణంగా భూమి సిద్ధం వంటి అంశాలపై నేరుగా మార్గనిర్దేశం చేయడమే ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే పద్ధతులపై కూడా రైతులకు అవగాహన కల్పించనున్నారు.
ఈ వాలంటీర్లకు ముందుగా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇక్రిశాట్ సహకారంతో మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభ దశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ నుంచి ఎంపికైన వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నారు.
భూసారం, నేల పరీక్షలు, పంటల సాగు, పోషక పదార్థాల వినియోగం, సేంద్రీయ పద్ధతులు వంటి అంశాలపై పూర్తి స్థాయి శిక్షణ అందించనున్నారు. శిక్షణ పూర్తయ్యాక ఈ వాలంటీర్లు గ్రామాల్లో రైతులకు ప్రత్యక్షంగా సేవలు అందించనున్నారు.
వ్యవసాయశాఖ మరియు ఇక్రిశాట్ కలిసి ఈ వ్యవస్థను క్రమబద్ధంగా అమలు చేయాలని భావిస్తున్నాయి. భూసార ఆరోగ్యాన్ని పరిరక్షించడం ఒక ఉద్యమంలా తీసుకెళ్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. పంట కోత తర్వాత మిగిలే అవశేషాలను తగలబెట్టకుండా, వాటిని ఎరువులుగా మార్చుకోవాలని రైతులకు సూచించారు.
“రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ ఎరువులకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. భూమిలో రసాయనాల ప్రభావం తగ్గితే, నేల సారవంతం పెరిగి పౌష్టికాహార విలువలు ఉన్న పంటలు పండే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.”
జీలుగు, పిల్లిపెసర, పచ్చిరొట్ట వంటి విత్తనాలతో భూసారం పెంచుకోవచ్చని వివరించారు. ఇదిలా ఉండగా, మే 4 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది.








