Saleswaram Yatra: దట్టమైన నల్లమల అడవిలో వెలసిన ప్రసిద్ధ సలేశ్వరం లింగమయ్య సాహస యాత్ర ఈరోజు తెల్లవారుజామున అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఏడాదికి కేవలం మూడు రోజులపాటు మాత్రమే అనుమతి ఉండే ఈ పవిత్ర యాత్రకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
తెల్లవారుజాము నుంచే భక్తులు అడవి మార్గంలో కాలి బాట పట్టడంతో నల్లమల అటవీ ప్రాంతం శివనామస్మరణతో మారుమోగిపోయింది.
ప్రకృతి ఒడిలో, జలపాతాల నడుమ వెలసిన సలేశ్వరం లింగమయ్య దర్శనం కోసం భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంతో అడవి దారిలో ముందుకు సాగుతున్నారు.
అయితే భక్తుల రద్దీ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటంతో మన్ననూర్ నుంచి ఫర్హాబాద్ చౌరస్తా వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. పూర్తిగా ఘాట్ రోడ్డు, ఇరుకైన మలుపులు ఉండటంతో ట్రాఫిక్ క్లియర్ చేయడం అధికారులకు సవాలుగా మారింది.
వందలాది వాహనాలు అడవి మార్గంలో నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అటవీ శాఖ, పోలీసు సిబ్బంది సమన్వయంతో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఈ యాత్ర సాహసోపేతమైనదిగా భావిస్తున్న అధికారులు భక్తులకు పలు సూచనలు జారీ చేశారు.
అడవిలో ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధించబడిందని, వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా ప్రయాణించాలని కోరుతున్నారు.
ఎండల తీవ్రత దృష్ట్యా తాగునీరు వెంట తీసుకెళ్లాలని, లోయలు, జారుడు ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. భారీ రద్దీ నేపథ్యంలో భక్తులు సహనంతో వ్యవహరించి అధికారులకు సహకరించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.








