Weather Update: వేసవి ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
తెలంగాణలో మరాత్వాడ నుంచి కర్ణాటక తీరం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు. రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉన్నప్పటికీ, ఆ తర్వాత నాలుగు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరగవచ్చని అంచనా వేశారు.
ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చని సూచించింది. కోస్తాంధ్ర, యానాంలో ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు లేకపోయినా, తర్వాతి రోజుల్లో స్వల్పంగా పెరుగుతాయని, రాయలసీమలో మాత్రం వచ్చే ఐదు రోజులు ఉష్ణోగ్రతలు స్థిరంగానే ఉండనున్నట్లు వెల్లడించింది.








