Subsea Cables: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థపైనా ప్రభావం చూపే పరిస్థితి తీసుకొచ్చాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి, ఎర్ర సముద్రంలోని బాబ్ అల్ మందేబ్ ప్రాంతాల్లో ఉన్న సముద్రగర్భ కేబుళ్ల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అండర్సీ కేబుళ్ల ద్వారానే ప్రపంచ అంతర్జాతీయ డేటా ట్రాఫిక్లో భారీ భాగం ప్రయాణిస్తుండటంతో, వీటికి అంతరాయం కలిగితే వీడియో కాల్స్, ఈమెయిల్స్, బ్యాంకింగ్ లావాదేవీలు, సోషల్ మీడియా, ఈ-కామర్స్, క్లౌడ్ సేవలు, ఏఐ ప్లాట్ఫారమ్లు వంటి అనేక డిజిటల్ సేవలు దెబ్బతినే అవకాశం ఉంది.
ప్రపంచ అంతర్జాతీయ డేటా ట్రాఫిక్లో 95-99 శాతం వరకు ఈ కేబుళ్లే మోస్తున్నాయని టెలికాం రంగ అంచనాలు చెబుతున్నాయి.
ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సముద్రగర్భ కేబుళ్లలో అంతరాయం ఏర్పడితే భారత్పై పడే ప్రభావాన్ని అంచనా వేయాలని, ప్రత్యామ్నాయ మార్గాలు, అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని టెలికాం కంపెనీలు, కేబుల్ ఆపరేటర్లకు సూచించినట్లు సమాచారం.
భారత్ నుంచి అమెరికా, యూరప్ వైపు వెళ్లే డేటా ట్రాఫిక్లో గణనీయమైన భాగం హర్మూజ్ మార్గం ద్వారా సాగుతుండటంతో, అక్కడ సమస్యలు తలెత్తితే ట్రాఫిక్ను ఇతర మార్గాలకు మళ్లించాల్సి రావొచ్చు. అయితే అలా చేస్తే ఖర్చులు పెరగడంతో పాటు డేటా వేగం తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇటీవల ఎర్ర సముద్ర ప్రాంతంలో జరిగిన కేబుల్ దెబ్బతినే ఘటనలు ఈ ముప్పు నిజమేనని గుర్తు చేశాయి. బాబ్ అల్ మందేబ్ సమీపంలో పలు కేబుళ్లు దెబ్బతినడంతో ఆసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాల్లో ఇంటర్నెట్ సేవలు ప్రభావితమైనట్లు అంతర్జాతీయ నివేదికలు తెలిపాయి.
కొన్ని మరమ్మతు నౌకల కార్యకలాపాలు కూడా ప్రభావితమవుతున్న నేపథ్యంలో, భద్రతతో పాటు వేగవంతమైన మరమ్మతు సామర్థ్యం కూడా కీలకంగా మారింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, కేబుళ్లు పూర్తిగా ధ్వంసం కావడం అరుదైనా, దెబ్బతిన్నా మాత్రం బ్యాంకింగ్, ఐటీ, డేటా సెంటర్లు, డిజిటల్ ఎకానమీపై గణనీయమైన ప్రభావం పడొచ్చు. అందుకే సముద్రగర్భ డిజిటల్ మౌలిక వసతుల భద్రత ఇప్పుడు దేశాల ఆర్థిక భద్రతతో సమానంగా మారుతోంది.








