Income Tax Deadline: 2025-26 ఆర్థిక సంవత్సరం దగ్గర పడడంతో మార్చి 31 పన్ను చెల్లింపుదారులకు కీలక గడువుగా మారింది. ఈసారి కొత్త పన్ను విధానాన్ని ప్రభుత్వం మరింత ఆకర్షణీయంగా మార్చింది.
2025-26 బడ్జెట్ ప్రకారం, కొత్త పన్ను విధానంలో జీతభత్యాలపై స్టాండర్డ్ డిడక్షన్ సహా రూ.12.75 లక్షల వరకూ ఆదాయం ఉన్న వారికి పన్ను భారం లేకుండా ఉండేలా మార్పులు తీసుకొచ్చారు. అందువల్ల ఈ పరిధిలో ఉన్నవారు కేవలం పన్ను ఆదా కోసమే పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేకపోవచ్చు.
అయితే పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నవారు మార్చి 31లోపు కొన్ని విషయాలు తప్పనిసరిగా పూర్తి చేయాలి.
పాత విధానంలో సెక్షన్ 80సీ కింద పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, జీవిత బీమా ప్రీమియం, సుకన్య సమృద్ధి వంటి అర్హత కలిగిన పెట్టుబడులపై గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది.
ఈ పరిమితిని ఇంకా పూర్తి చేయని వారు వెంటనే సమీక్షించి పెట్టుబడులు పూర్తి చేయడం మంచిది. 80సీ కింద అనుమతించే పెట్టుబడుల జాబితాను ఆదాయపన్ను శాఖ స్పష్టంగా పేర్కొంది.
పీపీఎఫ్ ఖాతాదారులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 జమ చేయాలి. లేదంటే ఖాతా డిస్కంటిన్యూ అవుతుంది.
మళ్లీ యాక్టివ్ చేయాలంటే డిఫాల్ట్ అయిన ప్రతి సంవత్సరానికి కనీస డిపాజిట్తో పాటు రూ.50 ఫీజు చెల్లించాలి. అలాగే సుకన్య సమృద్ధి ఖాతాలో ప్రతి ఆర్థిక సంవత్సరానికి కనీసం రూ.250 జమ చేయడం తప్పనిసరి.
సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా ప్రీమియంపై కూడా పన్ను మినహాయింపు లభిస్తుంది. మీకు, జీవిత భాగస్వామికి, ఆధారిత పిల్లల కోసం చెల్లించిన ప్రీమియంపై రూ.25,000 వరకు, సీనియర్ సిటిజన్ అయితే రూ.50,000 వరకు మినహాయింపు ఉంటుంది. తల్లిదండ్రుల కోసం చెల్లించిన ప్రీమియంపైనా అదనపు మినహాయింపు పొందవచ్చు.
దీర్ఘకాలిక మూలధన లాభాల విషయంలో కూడా ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు సమీక్ష అవసరం. మీ లాభాల స్థితి, అమ్మకాల సమయం, తిరిగి రి ఇన్వెస్ట్మెంట్(Re investment) వంటి అంశాలపై నిర్ణయం తీసుకునే ముందు ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.
ముఖ్యంగా పాత పన్ను విధానంలో ఉన్న ఉద్యోగులు తమ పెట్టుబడి రుజువులను కార్యాలయానికి వెంటనే సమర్పించడం ద్వారా టిడిఎస్ లెక్కింపులో పొరపాట్లు తగ్గించుకోవచ్చు.







