Maha Shivaratri Special Buses: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ నెల 15న మహాశివరాత్రి సందర్భంగా, ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు రాష్ట్రంలోని 43 ప్రముఖ శైవక్షేత్రాలకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది.
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249, కీసరగుట్టకు 326, వేలాలకు 127, కాళేశ్వరానికి 71తో పాటు కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప వంటి ఆలయాలకు మరో 273 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్బీ, బీహెచ్ఈఎల్ ప్రాంతాల నుంచి శ్రీశైలంకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ఆయా కేంద్రాల్లో భక్తుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, తాగునీరు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్లను ఏర్పాటు చేస్తోంది.
ప్రభుత్వ జీవో ప్రకారం స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలు గరిష్టంగా 1.5 రెట్లు సవరించగా, రెగ్యులర్ సర్వీసుల ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ సవరించిన ఛార్జీలు ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు మాత్రమే వర్తిస్తాయి. ఏడుపాయల ప్రత్యేక బస్సులకు ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు అమల్లో ఉంటాయి.
మహిళలకు పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుంది. హైదరాబాద్–శ్రీశైలం స్పెషల్ బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించారు.
భక్తులు [www.tgsrtcbus.in](http://www.tgsrtcbus.in) ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సమాచారం కోసం 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించవచ్చు.








