Kakinada Traffic Hero: కాకినాడలో ట్రాఫిక్ జామ్ సమయంలో చంటి బిడ్డను భుజాన వేసుకుని అంబులెన్సులకు దారి చూపిన లేడీ కానిస్టేబుల్ జయశాంతిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రంగంపేటకు చెందిన జయశాంతి చేసిన సేవా భావం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత లేడీ కానిస్టేబుల్ జయశాంతికి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. విధుల్లో లేకపోయినా, సామాజిక బాధ్యతతో ట్రాఫిక్ను చక్కదిద్దిన తీరు పోలీసులపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచిందని మంత్రి ప్రశంసించారు.
ALSO READ:Mumbai Bus Fire | ముంబైలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు మంటలు….తప్పిన పెను ప్రమాదం
జయశాంతి కుటుంబ యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నారు. త్వరలో ప్రత్యక్షంగా కలుస్తామని హామీ ఇచ్చారు.
శనివారం సాయంత్రం కాకినాడ కెనాల్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రైల్వే గేటు వద్ద లారీ ఆగిపోవడంతో సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఈ జామ్లో రెండు అంబులెన్సులు, పురిటి నొప్పులతో ఉన్న గర్భిణి చిక్కుకుపోయారు. ఈ సమయంలో డ్యూటీ ముగిసినప్పటికీ, జయశాంతి చంటిబిడ్డను భుజాన వేసుకుని ట్రాఫిక్ క్లియర్ చేసి అంబులెన్సులను బయటకు తీసుకువచ్చారు.
ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కూడా స్పందిస్తూ, మాతృత్వం – కర్తవ్యాన్ని సమానంగా నిర్వర్తించినందుకు సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. జయశాంతి నిబద్ధత పోలీస్ వ్యవస్థకు గర్వకారణంగా నిలిచిందని పలువురు ప్రశంసిస్తున్నారు.
