ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ (25) అనే వ్యక్తి ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేశాడు. ఫంక్షన్ ఉందని ఇంటికి పిలిచి యువతిని అతి దారుణంగా మోసం చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినిని ఇంటికి ఆహ్వానించిన హుస్సేన్, ఇంటికి వెళ్ళేసరికి అతని స్నేహితులు షేక్ గాలి సైదా (26), చింతల ప్రభుదాస్ (25) అక్కడే ఉన్నారు. ఫంక్షన్ జరగకపోవడంతో విద్యార్థిని అనుమానించి నిలదీయగా, హుస్సేన్ వ్యక్తిగతంగా మాట్లాడాలని నమ్మించి బయటకు వెళ్లిపోయాడు.
ఆ సమయంలో హుస్సేన్, ప్రభుదాస్ ఇంటి బయట కాపలా ఉండగా, గాలి సైదా గదిలోకి వచ్చి యువతిని బలవంతం చేశాడు. హుస్సేన్తో దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించి అత్యాచారం చేశాడు. అనంతరం ముగ్గురు నిందితులు ఆమెను వేధించసాగారు.
తనపై జరిగిందంతా తల్లిదండ్రులకు వివరించిన విద్యార్థిని వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుస్సేన్, ప్రభుదాస్, గాలి సైదా అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బాధితురాలికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.