యాదగిరిగుట్టను ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోనే అతిపెద్ద వేద పాఠశాల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భూమిపూజ చేశారు.
టెంపుల్ సిటీ(Temple City) అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టనున్న పలు ఆలయ అనుబంధ ప్రాజెక్టులకు కూడా ఈ సందర్భంగా శంకుస్థాపనలు నిర్వహించారు. యాదగిరిగుట్టను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తరహాలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రూ. 43.80 కోట్ల అంచనా వ్యయంతో 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ వేద పాఠశాలలో సంప్రదాయ ఆశ్రమ గురుకుల విధానంలో విద్య బోధించనున్నారు. సుమారు 300 మంది విద్యార్థులకు వసతి సౌకర్యాలతో కూడిన వేద విద్యను అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
ఈ సముదాయంలో హోమాలు, యాగాలు నిర్వహించేందుకు ప్రత్యేక శాలలు, గోశాల, విద్యార్థుల వసతి గృహాలు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా రూ. 43.12 కోట్లతో డార్మిటరీ హాల్స్ మరియు దీక్షాపరుల సదనం నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు.
కొండపై స్వామివారి నిత్య కల్యాణోత్సవాల నిర్వహణ కోసం రూ. 9.87 కోట్లతో భారీ కల్యాణ మండపం నిర్మించనున్నారు. భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి రూ. 1.41 కోట్లతో రక్షణ పైకప్పు (కానోపీ) నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే రథశాల వైపు మాడవీధులకు అనుసంధానంగా రూ. 1.35 కోట్లతో కొత్త మెట్ల నిర్మాణ పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు.
ఈ అభివృద్ధి పనులతో యాదగిరిగుట్టలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు ఆధ్యాత్మిక, వేద విద్యా కేంద్రంగా మరింత గుర్తింపు పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.








