టాటా ఐపీఎల్ 2025 క్రికెట్ పోటీలు మార్చి 23న ప్రారంభం కానుండగా, ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. స్టేడియం పరిసరాల్లో పార్కింగ్ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్టేడియం పరిసరాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని తెలిపారు. స్టేడియం భద్రత కోసం సుమారు 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అన్ని పోలీస్ విభాగాల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
ప్రేక్షకులు ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, అగ్గిపెట్టెలు, పదునైన వస్తువులు, తినుబండారాలు, వాటర్ బాటిల్స్ తీసుకురాకూడదని స్పష్టం చేశారు. స్టేడియంలోకి ఈ వస్తువులను అనుమతించరాదని, భద్రతా అధికారులకు తగిన సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.
క్రికెట్ అభిమానుల రవాణా సౌలభ్యం కోసం మెట్రో రైలు సేవలు రాత్రిపూట ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయని, ట్రాఫిక్ సమస్యల నుంచి తప్పించుకునేందుకు వీలైనన్ని మంది మెట్రో సేవలు వినియోగించుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.