Heatwave Alert: తెలంగాణలో ఎండల తీవ్రత మరింత పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాల్పులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. పరిస్థితుల తీవ్రత దృష్ట్యా మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
అదే సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు నిజామాబాద్, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముందని అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రత్యేకంగా ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వడగాల్పులు, ఉరుములు-మెరుపులు, బలమైన గాలుల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.








