Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో కీలక గుడ్ న్యూస్ ప్రకటించింది. ధాన్యం సేకరణకు సంబంధించిన నిధులను వారం రోజుల్లోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, అమ్మకం పూర్తైన తర్వాత వారం రోజుల్లోపే డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయని హామీ ఇచ్చారు.
రైతు భరోసా పథకం కింద ఇప్పటికే తొలి విడత నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, రెండో, మూడో విడత చెల్లింపులపై త్వరలో స్పష్టత ఇవ్వనుంది.
ఈ నెలాఖరులోగా అన్ని ఎకరాలకు పెట్టుబడి సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఎకరానికి రూ.12,000 చొప్పున రైతులకు రైతు భరోసా అందిస్తున్నామని ఆయన గుర్తు చేశారు.
అలాగే సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రైతులు ఇకపై నెలల తరబడి చెల్లింపుల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదని మంత్రి స్పష్టం చేశారు.
ఇప్పటివరకు 3.80 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ధరణి పోర్టల్ లోపాల కారణంగా గతంలో రైతులు నష్టపోయారని, ఆ సమస్యలను పరిష్కరించేందుకు భూభారతి పోర్టల్ తీసుకొచ్చినట్లు తెలిపారు.
రైతు సంక్షేమం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పేదలకు అండగా నిలుస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. సన్న వడ్లను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తూ మార్కెట్లో సమతుల్యత తీసుకొస్తున్నట్లు తెలిపారు.








