DGP CV Anand: రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం ఇకపై మరింత కఠిన వైఖరి అనుసరిస్తామని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. నేరాల నియంత్రణలో ఎటువంటి సడలింపు ఉండబోదని, నేరగాళ్లపై ఉక్కుపాదం మోపే విధంగా పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని ఆయన తెలిపారు. మీడియాతో మాట్లాడిన డీజీపీ, రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల సమస్య, శాంతిభద్రతల పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటివరకు కొనసాగిన “ఫ్రెండ్లీ పోలీసింగ్” విధానంలో మార్పులు అవసరమని, నేరాల నియంత్రణే ప్రాధాన్యతగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో మావోయిజం పూర్తిగా అంతమైందని డీజీపీ అధికారికంగా ప్రకటించారు. మారుతున్న పరిస్థితులు, కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీస్ విభాగంలో పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రత్యేకంగా అటవీ ప్రాంతాల్లో పనిచేసే ఎలైట్ ఫోర్స్ గ్రేహౌండ్స్ విభాగాన్ని రీఆర్గనైజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగా సుమారు 1700 మంది సిబ్బందిని కొత్తగా కీలకంగా మారిన విభాగాలైన సైబర్ క్రైమ్, నార్కోటిక్స్ వంటి విభాగాలకు బదిలీ చేస్తున్నట్లు చెప్పారు.
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో టెక్నాలజీ ఆధారిత దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో యువతను లక్ష్యంగా చేసుకుని విస్తరిస్తున్న గంజాయి, డ్రగ్స్ నెట్వర్క్లను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
డ్రగ్స్ సరఫరా గొలుసును ధ్వంసం చేయడమే ప్రధాన లక్ష్యమని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లను ఎదుర్కొనేందుకు పోలీస్ సిబ్బందికి ఆధునిక సాంకేతిక శిక్షణ ఇస్తున్నట్లు డీజీపీ తెలిపారు. క్షేత్రస్థాయిలో మెరుగైన పనితీరు కనబరుస్తున్న ఆదిలాబాద్ జిల్లా పోలీసులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.








