Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. గత ట్రేడింగ్ సెషన్లో లాభాలతో ముగిసిన సూచీలు ఒక్కరోజులోనే మళ్లీ నష్టాల బాట పట్టాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు వంటి కారణాలతో మార్కెట్పై ప్రతికూల ప్రభావం కనిపించింది.
ఫలితంగా BSE Sensex దాదాపు వెయ్యి పాయింట్లకు పైగా పడిపోయింది. అలాగే Nifty 50 కూడా 24,500 మార్క్కు దిగువన ముగిసింది.
యుద్ధ భయాలతో మార్కెట్లపై ఒత్తిడి
శుక్రవారం ట్రేడింగ్లో సెన్సెక్స్ 79,658.99 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అంతకుముందు రోజు ముగింపు 80,015.90 పాయింట్ల వద్ద ఉండగా, మొదటి నుంచే మార్కెట్ నష్టాల్లోకి జారింది.
రోజంతా అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 78,812.18 కనిష్ఠ స్థాయిని తాకింది. చివరికి 1097 పాయింట్లు కోల్పోయి 78,918.90 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 315.45 పాయింట్లు పడిపోయి 24,450.45 వద్ద స్థిరపడింది.
రూపాయి బలహీనత, చమురు ధరల పెరుగుదల
అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపించాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 91.74 వద్ద నమోదైంది. అంతేకాకుండా బ్రెంట్ క్రూడ్ (Brent Crude) ధర బ్యారెల్కు 86.98 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ధర ఔన్సుకు 5082 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్లోని కంపెనీలలో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి షేర్లు నష్టాల్లో ముగిశాయి. అయితే బీఈఎల్, రిలయన్స్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ షేర్లు మాత్రం లాభాల్లో నిలిచాయి.
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు
పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయన్న వార్తలు పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచాయి. అంతేకాకుండా పీట్ హెగ్సెత్ చేసిన “యుద్ధం ఇప్పుడే ప్రారంభమైంది” అన్న వ్యాఖ్యలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
మరోవైపు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) భారీగా షేర్లను విక్రయించడం కూడా మార్కెట్ పతనానికి కారణమైంది. ఎన్ఎస్ఈ సమాచారం ప్రకారం ఒక్కరోజులోనే రూ.3,762 కోట్ల విలువైన షేర్లను విదేశీ పెట్టుబడిదారులు విక్రయించారు.
మార్చి నెలలో ఇప్పటివరకు రూ.21,436 కోట్ల షేర్లు అమ్మడం మార్కెట్పై మరింత ఒత్తిడిని తెచ్చింది.









