దేశంలో నోట్ల ముద్రణ వ్యయం పెరుగుతూ ఉండటంతో పాటు పాడైపోయిన, చిరిగిపోయిన, మురికిగా మారిన కరెన్సీ నోట్ల సంఖ్య ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్లాస్టిక్ ఆధారిత పాలిమర్ నోట్ల(Polymer Currency Notes) అమలుపై మళ్లీ దృష్టి పెట్టింది. పదేళ్ల క్రితం ప్రతిపాదించిన ఈ ప్రణాళికను ఇప్పుడు మళ్లీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలో పైలట్ ప్రాజెక్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రోజువారీ వినియోగంలో ఎక్కువగా పాడయ్యే రూ.10, రూ.20 నోట్లతో ఈ ప్రయోగాన్ని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్లలా కాకుండా ప్రత్యేకమైన సన్నని ప్లాస్టిక్ పదార్థంతో తయారు చేస్తారు.
ఇవి తేమ, మురికి, చిరిగిపోవడం వంటి సమస్యలకు ఎక్కువకాలం ప్రతిఘటిస్తాయి. అంతేకాకుండా ఈ నోట్లలో పారదర్శక విండోలు, ప్రత్యేక హోలోగ్రామ్లు వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు ఉండటంతో నకిలీ నోట్లు తయారు చేయడం కూడా కష్టమవుతుంది.
ఇటీవల కరెన్సీ ముద్రణ ఖర్చులు భారీగా పెరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణకు రూ.6,372 కోట్లకుపైగా ఖర్చయినట్లు సమాచారం. అదే సమయంలో దెబ్బతిన్న నోట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మరింత ఎక్కువ నోట్లు చెలామణి నుంచి తొలగించాల్సి వచ్చింది.
డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నప్పటికీ దేశంలో నగదు వినియోగం ఇంకా అధికంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో చెలామణిలో ఉన్న కరెన్సీ విలువ రూ.42 లక్షల కోట్లకు పైగా చేరింది. పాలిమర్ నోట్ల ఆలోచన భారత్కు కొత్తది కాదు.
2012లోనే కొచ్చి, మైసూరు, జైపూర్, భువనేశ్వర్, షిమ్లా నగరాల్లో ప్రయోగాత్మకంగా వీటిని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అయితే అప్పట్లో ఏటీఎంల సాంకేతిక సమస్యల కారణంగా ప్రాజెక్టును నిలిపివేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, సింగపూర్, మలేషియా వంటి 60కు పైగా దేశాలు పాలిమర్ కరెన్సీని ఉపయోగిస్తున్నాయి. ఎక్కువ మన్నిక, తక్కువ భర్తీ ఖర్చు, మెరుగైన భద్రత వంటి ప్రయోజనాలు ఉండటంతో ఈ విధానంపై ఆర్బీఐ మళ్లీ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.








