Rain alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. IMD(India Meteorological Department) ఆధ్వర్యంలోని అమరావతి కేంద్రం తెలిపిన ప్రకారం, దక్షిణ అంతర్గత కర్ణాటక పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
అలాగే దక్షిణ కర్ణాటక నుంచి మహారాష్ట్ర వరకు విస్తరించిన ద్రోణి ప్రస్తుతం ఉత్తర కర్ణాటక మీదుగా సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది.
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని అంచనా. అయితే రేపటికి అక్కడ పొడి వాతావరణం కొనసాగవచ్చని పేర్కొన్నారు.
రాయలసీమలో మాత్రం ఈ రోజు, రేపు, ఎల్లుండి ప్రధానంగా పొడి వాతావరణమే ఉండనుంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పులు ఉండవని అధికారులు స్పష్టం చేశారు.
ఇక తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రం నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు మెరుపుల సమయంలో చెట్ల కింద నిలవకూడదని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ALSO READ:Virosh Wedding | ఉదయపూర్లో ఘనంగా విజయ్–రష్మిక వివాహం…పెళ్లి విందు ప్రత్యేకతలు








