LPG Rules: దేశంలో ఎల్పీజీ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం కీలక విధాన మార్పులకు సన్నద్ధమవుతోంది. జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానుండగా, ఒకే కుటుంబం ఒకేసారి పీఎన్జీ (PNG) మరియు ఎల్పీజీ కనెక్షన్లను కొనసాగించడంపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
“ఒక కుటుంబానికి – ఒక కనెక్షన్” అనే విధానాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దేశంలో పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) విస్తరణ వేగంగా జరుగుతున్నప్పటికీ, ఎల్పీజీ వినియోగం ఆశించిన స్థాయిలో తగ్గకపోవడం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా సుమారు 6.5 లక్షల కొత్త పీఎన్జీ కనెక్షన్లు మంజూరు అయినప్పటికీ, వినియోగం అంచనాల కంటే 18 శాతం తక్కువగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు.
అనేక కుటుంబాలు పీఎన్జీ కనెక్షన్ తీసుకున్నప్పటికీ, పాత ఎల్పీజీ కనెక్షన్లను కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది.ఈ నేపథ్యంలో పీఎన్జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలు స్వచ్ఛందంగా ఎల్పీజీ కనెక్షన్లను వదులుకోవాలని ఇప్పటికే సూచనలు జారీ చేశారు.
అయితే స్పందన తక్కువగా ఉండటంతో చమురు మార్కెటింగ్ సంస్థలు (OMCs) కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాయి. సవరించిన నిబంధనల ప్రకారం ఒకే చిరునామాలో పీఎన్జీ మరియు ఎల్పీజీ రెండు కనెక్షన్లు ఉండటాన్ని నిషేధంగా పరిగణించే అవకాశం ఉంది.
ఇప్పటికే అర్హత ఉన్న కుటుంబాలను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ గడువులోగా ఎల్పీజీ కనెక్షన్ రద్దు చేయకపోతే గ్యాస్ సరఫరా నిలిపివేయడం లేదా కనెక్షన్ పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మార్పుల వల్ల ప్రధాన ఉద్దేశం పీఎన్జీ వినియోగాన్ని పెంచడం, అలాగే ఒకే కుటుంబంలో రెండు గ్యాస్ కనెక్షన్లు ఉండే పరిస్థితిని తగ్గించడం అని తెలుస్తోంది.








