LPG cylinder booking: వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్పులు తీసుకురాబోతున్నట్లు సమాచారం. మే 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ విధానంలో కీలక మార్పులు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ధరల పెంపుపై కూడా చర్చలు జరుగుతున్నాయి.
కొత్త నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో సిలిండర్ బుకింగ్కు కనీసం 25 రోజుల గ్యాప్ తప్పనిసరి చేయనున్నట్లు తెలుస్తోంది. అంటే ఒకసారి బుక్ చేసిన తర్వాత మళ్లీ మరో సిలిండర్ బుక్ చేయడానికి కనీసం 25 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది.
అలాగే ఓటీపీ ఆధారిత డెలివరీ విధానాన్ని పూర్తిగా అమలు చేయనున్నారు. వినియోగదారుడికి వచ్చిన ఓటీపీని నిర్ధారించిన తర్వాతే గ్యాస్ సిలిండర్ అందజేయనున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కూడా దేశీయ ఎల్పీజీ సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత చమురు కంపెనీలు అమెరికా నుంచి దిగుమతులను పెంచుతున్నాయి.
ప్రస్తుతం దేశానికి రోజుకు సుమారు 80 వేల టన్నుల ఎల్పీజీ అవసరం ఉండగా, దేశీయ ఉత్పత్తి మాత్రం 46 వేల టన్నులకే పరిమితమై ఉంది.
ఇటీవల కొన్ని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కొత్త గ్యాస్ కనెక్షన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ఇది సరఫరా సమతుల్యం కోసం తీసుకున్న తాత్కాలిక చర్యగా అధికారులు చెబుతున్నారు.
ఇక మరోవైపు మే 1 నుంచి వంటగ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రతి నెలా 1వ తేదీన ఎల్పీజీ ధరలను సమీక్షించే విధానం ఉండటంతో ఈసారి కూడా పెంపు ఉండొచ్చనే ఆందోళన వినియోగదారుల్లో కనిపిస్తోంది.








