Kokapet Sharada Peetham: కోకాపేటలోని శారదా పీఠానికి కేటాయించిన భూమి విషయంలో సమాచార లోపం కారణంగా ఏర్పడిన అపార్థాన్ని ప్రభుత్వం సరిదిద్దుకుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి నిర్ణయాన్ని పునఃసమీక్షించినట్లు వెల్లడించారు.
నిన్న శారదా పీఠాన్ని సందర్శించిన మంత్రి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో భేటీ అయ్యారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హిందూ ధర్మానికి సంబంధించిన విషయాల్లో ఎటువంటి తప్పిదం జరగకుండా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
పీఠానికి చెందిన దేవాలయం, భూములు, కట్టడాలు, భక్తుల కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం కలగదని సీఎం తరఫున హామీ ఇచ్చినట్లు తెలిపారు.
సమాచార లోపం ఉన్నట్లు తెలిసిన వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని రాజకీయ లాభాల కోసం ఉపయోగించుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
కోకాపేటలో 17 ఎకరాల భూమిపై ప్రశ్నించగా, వ్యాపారులు తమ వ్యాపారాలు కొనసాగించడంలో తప్పేముందని అన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుపై స్థానికులతో చర్చించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.









