India Venezuela Relations: అధికారిక పర్యటనలో భాగంగా వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్(Delcy Rodriguez) భారత్లో ఉన్నారు. ఈ పర్యటనలో భారత్–వెనిజులా(India Venezuela) భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే విషయాలపై ముఖ్యమైన చర్చలు జరిగాయి. గురువారం ఆమె ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ భేటీలో ఇంధన భద్రత, ముడి చమురు దిగుమతులు, వాణిజ్యం, పెట్టుబడులు వంటి అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో భారత్ తన ఇంధన వనరులను విస్తరించేందుకు వెనిజులాతో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది. సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా పాల్గొన్నారు. ఇంధన రంగంతో పాటు వాణిజ్యం, ఔషధాలు, ఆరోగ్యం, రవాణా మరియు పునరుత్పాదక ఇంధన రంగాల్లో సహకారాన్ని విస్తరించే అవకాశాలపై కూడా చర్చలు జరిగాయి.
గతంలో వెనిజులా నుంచి భారత్ రోజుకు నాలుగు లక్షల బ్యారెళ్లకు పైగా ముడి చమురును దిగుమతి చేసుకునేది. అయితే అమెరికా ఆంక్షల కారణంగా 2020 తర్వాత ఈ దిగుమతులు తగ్గిపోయాయి. తాజాగా ఆంక్షల సడలింపులతో భారత్ మళ్లీ వెనిజులా చమురు కొనుగోళ్లను ప్రారంభించింది.ఇంధన రంగంలో ఇప్పటికే రెండు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం కొనసాగుతోంది.
ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ మరియు వెనిజులా చమురు సంస్థ CVP కలిసి ‘‘పెట్రోలెరా ఇండోవెనెజోలానా SA’’ పేరుతో సంయుక్త ప్రాజెక్టును నిర్వహిస్తున్నాయి. శాన్ క్రిస్టోబల్ చమురు క్షేత్రంలో ఈ ప్రాజెక్టు ద్వారా అన్వేషణ, ఉత్పత్తి కార్యకలాపాలు జరుగుతున్నాయి. డెల్సీ రోడ్రిగ్జ్తో పాటు వెనిజులా విదేశాంగ, ఆర్థిక, సాంకేతిక, సమాచార, రవాణా శాఖల మంత్రులు కూడా ఈ పర్యటనలో భాగమయ్యారు. ఈ పర్యటనతో భారత్–వెనిజులా వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడతాయని దౌత్య వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.








