India US Deal: చైనా ఆధిపత్యానికి చెక్ చెక్ పెట్టేందుకు భారత్, అమెరికా(India and US) దేశాలు కీలక ఖనిజాలు మరియు రేర్ ఎర్త్స్ సరఫరా భద్రతను బలోపేతం చేయడానికి ఒక వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయి. న్యూఢిల్లీలో జరిగిన క్వాడ్(QUAD) విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ఈ ఒప్పంద ఫ్రేమ్వర్క్ను భారత్ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కలిసి అధికారికంగా ఆమోదించారు.
ఈ ఒప్పంద ప్రధాన లక్ష్యం సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), క్లీన్ ఎనర్జీ, రక్షణ సాంకేతిక రంగాలకు అవసరమైన కీలక వనరుల సరఫరా గొలుసును మరింత బలోపేతం చేయడం. ముఖ్యంగా రేర్ ఎర్త్స్ ప్రాసెసింగ్, సరఫరాలో చైనా ఆధిపత్యాన్ని తగ్గిస్తూ ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను అభివృద్ధి చేయడంపై రెండు దేశాలు దృష్టి సారించాయి.
ఒప్పందం అనంతరం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ, “కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్స్ తవ్వకం నుంచి ప్రాసెసింగ్, రీసైక్లింగ్ వరకు మొత్తం సరఫరా వ్యవస్థలో భారత్–అమెరికా సహకారాన్ని విస్తరించేందుకు ఈ ఫ్రేమ్వర్క్ ఉపయోగపడుతుంది” అని తెలిపారు. పెట్టుబడులు, ఫైనాన్సింగ్, సమర్థవంతమైన నిర్వహణ వంటి రంగాల్లో కూడా సహకారం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ, భారత్–అమెరికా రెండూ దీర్ఘకాలికంగా కీలక ఖనిజాల సరఫరా భద్రతను లక్ష్యంగా పెట్టుకున్నాయని చెప్పారు. ఇన్నోవేషన్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు ఇవి అత్యంత కీలకమని ఆయన అన్నారు. ఈ ఒప్పందానికి పునాది వాషింగ్టన్ డీసీలో జరిగిన క్రిటికల్ మినరల్స్ ఫోరమ్లో పడిందని, తర్వాత భారత్ ‘పాక్సిల్లా’ ఒప్పందంలో చేరడంతో వేగం పెరిగిందని తెలిపారు.
ఒక్క దేశం ఆధిపత్యంలో ఉన్న సరఫరా వ్యవస్థలపై ఆధారపడటం భవిష్యత్తులో జాతీయ ప్రయోజనాలకు ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ఈ ఒప్పందం భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
India US Deal | చైనా ఆధిపత్యానికి చెక్.. క్వాడ్ సమావేశంలో భారత్–అమెరికా కీలక ఖనిజాల ఒప్పందం
-








