Hanuman project: రాష్ట్ర అటవీశాఖ చరిత్రలో కీలక ముందడుగుగా ‘హనుమాన్’ ప్రాజెక్టును ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాలు మరియు చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం వల్ల ఏర్పడుతున్న సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని వెల్లడించారు.
అటవీ సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేక అలర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసి, వన్యప్రాణులు–మనుషుల మధ్య జరిగే సంఘర్షణలను తగ్గించే దిశగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
వన్యప్రాణుల సంరక్షణకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమం అనంతరం పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను భేటీ అయ్యారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీశాఖలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. జల్ జీవన్ మిషన్ (Jal Jeevan Mission) పనుల పురోగతి, నిధుల వినియోగం, నియోజకవర్గాల వారీగా రహదారి అభివృద్ధి కేటాయింపులపై సమీక్ష జరిగింది.
‘హనుమాన్’ ప్రాజెక్టు అమలు విధానం, లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణపై పవన్ సీఎంకు సమగ్ర నివేదిక సమర్పించినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు ద్వారా అటవీప్రాంతాల్లో నివసించే ప్రజలకు భద్రత పెరగడమే కాకుండా వన్యప్రాణుల సంరక్షణకు కొత్త దిశ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.








