Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomePeddapalliManthaniమంథనిలో యంగ్ ఇండియా సమీకృత విద్యా సంస్థల నిర్మాణానికి శంకుస్థాపన

మంథనిలో యంగ్ ఇండియా సమీకృత విద్యా సంస్థల నిర్మాణానికి శంకుస్థాపన

-

Chat on WhatsApp

ప్రపంచ మేటీ విద్యార్థులను తయారు చేసేలా యంగ్ ఇండియా విద్యా సంస్థల ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు.

శుక్రవారం రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు  పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ, జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్షతో కలిసి మంథని మండలంలో అడవి సోమనపల్లి గ్రామంలో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల పనులకు శంకుస్థాపన  చేశారు.

ఈ సందర్భంగా మంత్రి డి.శ్రీధర్ బాబు మాట్లాడుతూ,
మార్పు తిసుకువస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలను క్రమక్రమంగా అమలు చేస్తున్నామని అన్నారు.  గ్యారెంటీ పథకాలలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల సబ్సిడీ సిలిండర్, మరియు ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమం వచ్చే నెల నుంచి ప్రారంభిస్తామని అన్నారు.

విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా, బడుగు బలహీన వర్గాల పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందించేందుకు  సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, క్యాబినెట్ సహచరులు ఎన్నికల సమయంలో చెప్పిన మాట ప్రకారం విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని అన్నారు.

యంగ్ ఇండియా సమీకృత విద్యా సంస్థల క్రింద ప్రభుత్వం మొదటి విడతలో 28 పాఠశాలలను మంజూరు చేసిందని, మానేరు నది ఒడ్డున ఉన్న అడవి సోమనపల్లి గ్రామంలో యంగ్ ఇండియా సమీకృత విద్యా సంస్థ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించిన డిఎస్సీ నియామకం అంశాన్ని రికార్డు సమయంలో  ప్రజా ప్రభుత్వం పూర్తి చేసి, ఇటీవల ముఖ్యమంత్రి చేతుల మీదుగా 11 వేలకు పైగా నూతన టీచర్లను నియమించడం జరిగిందని, ఇదే గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ అనే యువకుడికి ఎస్.జి.టి ఉద్యోగం లభించిందని అన్నారు.  గడిచిన 10 ఏళ్ళలో పెండింగ్ ఉన్న  టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేశామని, విద్యాశాఖ మెరుగుపరిచేందుకు కమిషన్ ఏర్పాటు చేశామని అన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో , అన్ని వసతులతో కుల, మత భేదాలు లేకుండా మన విద్యార్థులకు విద్యాబోధన అందించేందుకు ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థను మంజూరు చేస్తుందని, 25 ఎకరాల విస్తీర్ణంలో ఎస్సి, ఎస్టీ ,బీసి, మైనారిటీ  వంటి అన్ని రంగాల విద్యార్దులు ఒకే ప్రాంగణంలో చదివేలా ఈ విద్యా సంస్థ ఉంటుందని అన్నారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థలో  4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన అందుతుందని, విద్యార్థుల సౌకర్యం కొరకు తరగతి గదులలో డిజిటల్ స్మార్ట్ బోర్డ్, కంప్యూటర్ ల్యాబ్ , 5 వేలకు పైగా పుస్తకాలతో కూడుకున్న గ్రంథాలయం మొదలగు అత్యాధునిక సౌకర్యాలతో 25  ఎకరాల విస్తీర్ణంలో విద్యాసంస్థ నిర్మాణం ఉంటుందని అన్నారు.

క్రీడలను ప్రోత్సహించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల్లో క్రికెట్ , ఫుట్ బాల్ ,బాస్కెట్ బాల్, టెన్నిస్ మొదలగు క్రీడలు ఆడేందుకు అవసరమైన గ్రౌండ్, ఇతర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. వచ్చే సంవత్సరం దసరా నాటికి ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థల నిర్మాణం పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొని వస్తామని, అన్ని వర్గాల విద్యార్థులు ఒకేచోట అంతర్జాతీయ స్థాయి విద్య అందుకునే అవకాశం కల్పిస్తామని అన్నారు.

ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థలలో ,2500 పైగా విద్యార్థుల చదువుకుంటారని, వీరికి 120 మంది టీచర్లను కేటాయించడం జరుగుతుందని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ద్వారా సొంతంగా విద్యుత్తు ఉత్పత్తి చేసుకునేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.  250 నుంచి 300 కోట్లు ఖర్చు చేసి ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల నిర్మాణం చేస్తున్నామని అన్నారు. త్వరలో రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ లోను మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.

అనంతరం మంత్రి గౌడ కులస్తులకు  కాటమయ్య రక్షక కవచ కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రతి రక్షక కవచ కిట్ పై దాదాపు 9 వేల రూపాయలు ఖర్చు చేసి సబ్సిడీపై పూర్తి ఉచితంగా గౌడ సోదరులకు అందిస్తుందని, చెట్టు పై కల్లు తీసేందుకు వెళ్లినప్పుడు ఈ కిట్ ఉపయోగించడం వల్ల ప్రమాదాలను నియంత్రించవచ్చని, ప్రతి గౌడ సోదరుడు ఈ కిట్ ను వినియోగించాలని అన్నారు. చెట్టు పైకి ఎక్కి కళ్ళు తీసే గౌడ సోదరులను గుర్తించి కాటమయ్య రక్షక కిట్లను ముందుగా పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ మాట్లాడుతూ,  బడుగు బలహీన వర్గాలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించి ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థలను నిర్మిస్తుందని అన్నారు.

మన రాష్ట్ర భవిష్యత్తు పిల్లలని, అటువంటి పిల్లల కోసం సమీకృత విద్యాలయాలు నిర్మించడం సంతోషకరమని అన్నారు.  బీ ఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి విద్యా హక్కు కల్పించారని అన్నారు. హైదరాబాద్ లో కాక వెంకట స్వామి విద్యా సంస్థను ఏర్పాటు చేసి సంవత్సరానికి 5 వేల మందిని తక్కువ ధర విద్య అందిస్తున్నారని తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,  పిల్లలకు అవసరమైన వసతులతో కూడిన రెసిడెన్షియల్ విద్యా సంస్థ ఆశించిన స్థాయిలో లేవని గమనించి ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందని, ముందస్తుగా 28 నియోజకవర్గాలలో నేడు శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు. మన జిల్లాలో మంథని అసెంబ్లీ నియోజకవర్గంలోని అడవి సోమనపల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థ మంజూరు కావడం జరిగిందని అన్నారు.

25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థ నిర్మిస్తున్నామని, భవిష్యత్తు అవసరాల కోసం మరో 5 ఎకరాలు విస్తరించే అవకాశం సైతం ఇక్కడ ఉందని, గ్రామ ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థ కోసం 900 మీటర్ల ప్రత్యేక 4 లైన్ రోడ్డు వేసేందుకు ప్రతిపాదనలు రూపొందించామని అన్నారు.
నాణ్యతతో కూడిన భవన నిర్మాణ వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొని వస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ రమ,ఆర్.& బి ఈ.ఈ.భావ్ సింగ్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్, ఎక్సైజ్ సూపరంటెండెంట్ మహిపాల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Crowd at Puri Jagannath Rath Yatra after a stampede incident in Odisha

Puri Jagannath Rath Yatra | జగన్నాథుడి రథయాత్రలో విషాదం.. 120 మందికి పైగా...

ఒడిశాలోని పూరీలో జరుగుతున్న శ్రీ జగన్నాథ రథయాత్ర(Puri Jagannath Rath Yatra) సందర్భంగా దుర్ఘటన చోటుచేసుకుని భక్తుల్లో విషాదాన్ని నింపింది. రథయాత్రను వీక్షించేందుకు భక్తులు పోటెత్తడంతో రద్దీ అదుపుతప్పి తొక్కిసలాట ఏర్పడింది. ఈ...
- Advertisement -
Chat on WhatsApp