నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో నూతనంగా విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించేందుకు మెదక్ ఎమ్మెల్యే డా. మైనపల్లి రోహిత్ రావు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, అధికారులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. చల్మెడ గ్రామానికి రూ.2.37 కోట్ల నిధులతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం ప్రారంభించామన్నారు.
ఇది మాటల ప్రభుత్వంలా కాకుండా చేతల్లో అభివృద్ధిని చూపించగల ప్రభుత్వమని ప్రజలకు హామీ ఇచ్చారు. తక్షణమే పనులు పూర్తి చేసి ప్రజలకు గరిష్టంగా లబ్ధి చేకూర్చేందుకు అధికారులు ప్రయత్నించాలని సూచించారు. గ్రామ ప్రజల సహకారం అభివృద్ధికి కీలకం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ రమ్యశ్రీ, ఎంపీడీవో రాజిరెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు శంకరయ్య, యాదయ్య, రాజు, గణేష్ తదితరులతో పాటు కాంగ్రెస్ నేతలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చల్మెడ అభివృద్ధి కోసం మరిన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.