Customs Duty: యుద్ధ వేళ దేశీయ మార్కెట్పై ప్రభావం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, హర్మూజ్ సముద్ర మార్గంలో సరుకు రవాణాపై ఏర్పడిన అనిశ్చితి నేపథ్యంలో, కొన్ని ముఖ్యమైన పెట్రోకెమికల్ ఉత్పత్తుల దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా మినహాయించింది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటన ప్రకారం, ఈ సడలింపు ఏప్రిల్ 2 నుంచి జూన్ 30 వరకు అమల్లో ఉంటుంది.
ఇప్పటికే పెట్రోల్, డీజిల్పై అదనపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కేంద్రం, ఇప్పుడు పరిశ్రమలకు అత్యవసరమైన ముడి పదార్థాల సరఫరా నిలకడగా ఉండేందుకు మరో ముందడుగు వేసింది.
ఈ నిర్ణయం ద్వారా మిథనాల్, అన్హైడ్రస్ అమోనియా, డైక్లోరోమిథేన్, వినైల్ క్లోరైడ్ మోనోమర్, స్టిరేన్, పాలీబ్యుటడిన్, స్టైరిన్ బ్యూటడిన్, అన్సాచురేటెడ్ పాలిస్టర్ రెసిన్స్ వంటి ఉత్పత్తులపై దిగుమతి సుంకం మాఫీ చేయబడింది.
ఈ సడలింపుతో దేశీయ పరిశ్రమలకు అవసరమైన ముడిసరకుల సరఫరా అంతరాయం లేకుండా కొనసాగడంతో పాటు, ఉత్పత్తి వ్యయభారం కూడా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్లాస్టిక్, టెక్స్టైల్, ఫార్మా, ఆటోమొబైల్, కెమికల్ రంగాలకు ఇది గణనీయమైన ఊరటగా మారనుంది.
అంతర్జాతీయ యుద్ధ ప్రభావంతో ముడి చమురు, సహజ వాయువు, ఎరువులు, ఇతర రసాయనాల సరఫరాలో ఒత్తిడి పెరిగిన వేళ, దిగుమతులపై ఆధారపడే భారత్కు ఈ నిర్ణయం వ్యూహాత్మకంగా మారింది.
తాత్కాలిక సడలింపే అయినప్పటికీ, తుది ఉత్పత్తుల ధరల పెరుగుదల నుంచి వినియోగదారులకు కొంత ఉపశమనం లభించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.








