Chardham Yatra: ఉత్తరాఖండ్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు భక్తుల యాత్రలకు అడ్డంకిగా మారుతున్నాయి. ఇటీవల పునఃప్రారంభమైన చార్ధామ్ యాత్రకు మరోసారి తాత్కాలిక బ్రేక్ పడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ముప్పు కారణంగా అధికారులు రెండు రోజుల పాటు యాత్రను నిలిపివేశారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో భక్తుల రక్షణకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గర్హ్వాల్ డివిజన్ కమిషనర్ ఆనంద్ స్వరూప్ మాట్లాడుతూ.. యాత్ర మార్గాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రయాణాలకు అనుమతి ఇవ్వబోమని తెలిపారు. ఇప్పటికే పలు కొండ ప్రాంతాల్లో కొండాచరియలు విరిగిపడి రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు.
ఉత్తరాఖండ్లోని కొన్ని జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం యాత్రలో ఉన్న భక్తులు సురక్షిత ప్రాంతాలు, బేస్ క్యాంపుల్లోనే ఉండాలని సూచించారు. వర్షాల తీవ్రత తగ్గి, మార్గాలు ప్రయాణానికి అనుకూలంగా ఉన్నాయని అధికారులు నిర్ధారించిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. కొండ ప్రాంతాల్లో అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని, నదులు, వాగుల సమీపానికి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని భక్తులు, పర్యాటకులను అధికారులు హెచ్చరించారు.








