Ap Population Policy: ఆంధ్రప్రదేశ్లో జనాభా నిర్వహణపై కొత్త విధానం తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పటి వరకు కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చినా, ఇకపై పాపులేషన్ మేనేజ్మెంట్పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ పాలసీ సిద్ధమవుతోందని, నెల రోజుల పాటు చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శాసనసభలో ఈ విషయంపై ఆయన ప్రకటన చేశారు.
2023 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 6.70 లక్షల మంది పిల్లలు జన్మిస్తున్నారని సీఎం వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (TFR) 1.5గా ఉందని, దీన్ని 2.1కి పెంచితేనే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో వృద్ధాప్యం వేగంగా పెరుగుతోందని ఆయన అన్నారు. 1992లో రాష్ట్రంలో టీఎఫ్ఆర్ 3గా ఉండగా, ప్రస్తుతం అది 1.5కు తగ్గిందని వివరించారు. తమిళనాడులో 1.4, కేరళలో 1.6, బిహార్లో 3గా టీఎఫ్ఆర్ ఉన్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో 57 శాతం మంది ఒక్క పిల్లతోనే ఆగిపోతున్నారని, 32 శాతం మంది ఇద్దరు పిల్లలను కనుతున్నారని, 9 శాతం మాత్రమే ఇద్దరికి మించిన పిల్లలను కనుతున్నారని సీఎం వివరించారు. ప్రస్తుతం 60 ఏళ్లు దాటినవారి శాతం 10గా ఉండగా, 2047 నాటికి అది 23 శాతానికి చేరే అవకాశముందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అమలు చేస్తామని తెలిపారు. దీన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని చెప్పారు.
ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కనిన కుటుంబాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. కాన్పు సమయంలో రూ.25 వేల నగదు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు.
అలాగే రెండో బిడ్డ పుట్టినప్పుడు తండ్రికి ఒక నెల, మూడో బిడ్డ పుట్టినప్పుడు రెండు నెలల సెలవు మంజూరు చేసే ప్రతిపాదన ఉందన్నారు.
‘‘ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు’’ అనే సందేశాన్ని సమాజంలో వ్యాప్తి చేయాలని సీఎం సూచించారు. భవిష్యత్లో సమతుల్య జనాభా వృద్ధి రాష్ట్ర అభివృద్ధికి కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.









