Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీపై చర్చ జరుగుతున్న సమయంలో కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. త్వరలోనే తాను కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తానని ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన ఆమె, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే బలమైన రాజకీయ వేదికను తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఆమె నోట ‘జై ఆంధ్ర’ నినాదం వినిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తిరుపతి పర్యటనకు వెళ్లిన కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) రేణిగుంట విమానాశ్రయంలో వద్ద మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తన శ్రేయోభిలాషులు, మద్దతుదారులు ఇచ్చిన స్వాగతానికి కృతజ్ఞతలు తెలుపుతూ ‘జై ఆంధ్ర’ అంటూ నినాదం చేశారు.
త్వరలోనే తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీకి స్వామివారి ఆశీస్సులు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
తనపై నమోదైన కేసుల విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. తప్పుడు కేసుతో నాలుగేళ్ల పాటు తనను వేధించారని, అయితే సత్యం తనవైపు ఉండటంతో కోర్టు తనను నిర్దోషిగా విడుదల చేసిందని తెలిపారు.
తిరుమల వెంకటేశ్వరా స్వామి పై తమ కుటుంబానికి గాఢమైన విశ్వాసం ఉందని, కేసు నుంచి విముక్తి పొందిన తర్వాత కాలినడకన స్వామివారిని దర్శించుకోవాలని మొక్కుకున్నట్లు చెప్పారు. ఆ మొక్కును తీర్చుకునేందుకే కుటుంబ సభ్యులు మరియు జాగృతి నాయకులతో కలిసి తిరుపతికి వచ్చినట్లు వెల్లడించారు.
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport) నుంచి బయలుదేరిన కవిత, తిరుపతికి చేరుకుని అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు వెళ్లి శుక్రవారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు.
ఇదిలా ఉండగా ఆమె చేసిన ‘జై ఆంధ్ర’ నినాదం వెనుక రాజకీయ వ్యూహం ఉందా అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఏపీ సెటిలర్ల ప్రభావం పెరగడంతో రాజకీయ సమీకరణాల్లో ఇది కీలక అంశంగా మారింది. ఈ నేపథ్యంలో కవిత వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.








