Golden Ram Dhanush: అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడికి ఒడిశా భక్తులు అపూర్వమైన భక్తిని చాటుకున్నారు. బాలరాముడికి బహుమతిని సిద్ధం చేశారు.
ఈ సందర్బంగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు రెండేళ్లు పూర్తవుతున్న వేళా సుమారు 286 కిలోల బరువున్న మహా స్వర్ణ రామధనుస్సును(Golden Ram Dhanush) అయోధ్య రాముడికి సమర్పించేందుకు ఏర్పాట్లు చేసారు. ఈ విశిష్టమైన కళాఖండాన్ని ఒడిశా రాష్ట్రం రూర్కెలాలో అత్యంత నైపుణ్యంతో రూపొందించారు.
ఈ స్వర్ణ ధనుస్సు తయారీలో ఒక కిలో స్వచ్ఛమైన బంగారం, రెండున్నర కిలోల వెండి, అలాగే రాగి, జింక్, ఇనుము వంటి లోహాల మిశ్రమాన్ని వినియోగించారు. దీని నిర్మాణానికి సుమారు రూ.1.10 కోట్ల వ్యయం అయినట్లు సమాచారం.
ALSO REAAAD:Legends Reunion: భారత క్రికెట్ గోల్డెన్ మెమరీస్.. లెజెండ్స్ రీయూనియన్ ఫోటో వైరల్
సుమారు 8 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో రూపొందిన ఈ ధనుస్సు అత్యంత గంభీరంగా, కళాత్మకంగా దర్శనమిస్తుంది.
పూరీ జగన్నాథ స్వామి–అయోధ్య శ్రీరాముడి మధ్య ఆధ్యాత్మిక అనుబంధాన్ని ప్రతిబింబించేలా, ఈ ధనుస్సుపై జగన్నాథ స్వామి ప్రతిమను, ప్రత్యేక ఫిలిగ్రీ కిరీటాన్ని సున్నితమైన శిల్పకళతో చెక్కారు. సనాతన జాగరణ మంచ్ ఆధ్వర్యంలో ఈ స్వర్ణ ధనుస్సును ఒడిశాలోని పలు జిల్లాల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు.
పూరీ క్షేత్రంలో సంప్రదాయబద్ధమైన పూజలు, పవిత్ర క్రతువులు పూర్తైన అనంతరం, ఈ స్వర్ణ ధనుస్సు శోభాయాత్రగా అయోధ్య దిశగా బయలుదేరింది.
జనవరి 22న, శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు రెండేళ్లు పూర్తయ్యే వార్షికోత్సవ సందర్భంగా, ఈ మహా స్వర్ణ రామధనుస్సును బాలరాముడి పాదాల చెంత భక్తిశ్రద్ధలతో సమర్పించనున్నారు.
