AP Legislative Council: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మత ధృవీకరణ వ్యాఖ్యలపై తీవ్ర వివాదం చెలరేగింది. కల్తీ నెయ్యి అంశంపై జరుగుతున్న చర్చలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు, “మీరు.. మీ నాయకుడు క్రిస్టియన్లు” అంటూ వ్యాఖ్యానించడం సభలో ఉద్రిక్తతకు దారితీసింది.
దీనిపై మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు వెంటనే స్పందించి, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో స్పష్టం చేయాలని కోరారు. తాను క్రిస్టియన్ కాదని, నేను హిందువునని ప్రకటించారు. దీంతో అచ్చెన్నాయుడు తన వ్యాఖ్య తప్పుగా అర్థమైందని, ఎలాంటి భేషజాలు లేకుండా క్షమాపణ చెబుతున్నానన్నారు.
అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) సభ్యులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆందోళన కొనసాగించారు. సభలో ఉద్రిక్తత పెరగడంతో చైర్మన్ సమావేశాన్ని వాయిదా వేశారు. తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది.
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు రావడంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గత టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పీఏపై లంచాల ఆరోపణలు ఉన్నాయని ప్రభుత్వం నివేదికలో పేర్కొనగా, 36 మందిని నిందితులుగా చేర్చినట్లు వెల్లడించింది.
చర్చ క్రమంగా ఆరోపణలు, ప్రతియారోపణల దిశగా మళ్లి సభ పలుమార్లు అంతరాయానికి గురైంది. మొత్తం ఘటన రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మత, పరిపాలనా అంశాలపై చర్చకు దారితీసింది.









